ప్రొద్దుటూరు: మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారి మాతృమూర్తి, స్వర్గీయ పుట్టా పోలమ్మ గారి చిత్రపటానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ప్రొద్దుటూరులోని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నివాసానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ , జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవితతో కలిసి స్వర్గీయ పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ , ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. స్వర్గీయ పుట్టా పోలమ్మ కుటుంబ విలువలు, సేవాభావం, నిరాడంబర జీవన విధానం, మానవీయతకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె ఆదర్శాలు, విలువలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సవిత, ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజుల రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, బీటెక్ రవి, లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, లక్ష్మీ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
