వైఎస్సార్ కడప జిల్లాకు రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలో చోటు


– బి.మఠం మండలం, నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్తకు రాష్ట్ర స్థాయి బాధ్యత

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీని పునర్‌నియమిస్తూ జి.ఓ.ఎం.ఎస్. నెం.8, తేదీ 30-06-2026ను జారీ చేసింది. ఈ కమిటీలో ఆహార భద్రత, ఆరోగ్యం, పోషకాహారం రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు/సామాజిక కార్యకర్తల నుంచి అనధికార సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఇందులో వైఎస్సార్ కడప జిల్లా, బి. మఠం మండలం, నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన టి. చైతన్య ( గ్రామీణ రిఫార్మేటివ్ సొసైటీ ప్రతినిధి) ప్రత్యేక వర్గం (ఎస్సీ) సభ్యురాలిగా రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలో స్థానం పొందారు. ఈ కమిటీకి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ శాఖ గౌరవ మంత్రి అధ్యక్షత వహించనుండగా, కమిటీ సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ దుకాణాల పనితీరు, ఆహార భద్రత, వినియోగదారుల హక్కుల పరిరక్షణ, పోషకాహార పథకాల అమలు వంటి అంశాలపై పర్యవేక్షణ, ప్రభుత్వానికి సూచనలు అందించడంలో ఈ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.