*మాన ప్రాణాలతో ‘‘మనుగడ’’ కొనసాగించాల్సిందేనా..?
* ఈ ప్రాంత మహిళలకు ‘‘స్వాతంత్ర ఫలాలు’’ హరించబడ్డటానికి కారకులెవ్వరూ?
* మహిళలను మాన ప్రాణాలకు గురిచేస్తే ‘‘అవార్డుల మీద అవార్డులు’’ ?
*ఇదేనా ’’అధికారగణం పరిపాలన’’ తీరు..?
ఇదేంటి.. ఈ ఫోటో చూడగానే ఇది బ్రిడ్జీ కదా .. దీనికి మహిళల మాన ప్రాణాలకు సంబంధం ఏముందని అనుకుంటే పొరబడినట్లే.. ఇది చూడటానికి ఎన్హెచ్-40 జాతీయ రహదారి.. ఆ రహదారికి అనుగుణంగా నిర్మించిన అండర్ బ్రిడ్జీ అనుకోండి అందులో తప్పేమి లేదు.. కానీ దీనికి మహిళ మాన ప్రాణాలకు, వారి స్వాతంత్ర ఫలాలు హరించబడటానికి కారణేమిటి అని భావిస్తే.. మీరు కూడా మహిళల మాన ప్రాణాలకు భంగం కల్గిస్తున్నవారే అవుతారు.. ఇంతకు ఆ రెంటికి సంబంధించిన కథనంలోకి వెళ్లితే…
-నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
మైదుకూరు పట్టణంకు కూతవేటు దూరంలో ఎన్హెచ్-40 రహదారి ఇది.. కడప నుండి మైదుకూరు మీదుగా కర్నూలుకు వెళ్లే రహదారి. మైదుకూరు పట్టణం నుండి కమలాపురం వరకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ఈ అండర్ బ్రిడ్జీ సర్వాయపల్లె రోడ్డుకు ఎన్హెచ్-40 అధికారులు నిర్మించారు.. అంత వరకు బాగానే ఉంది. నిర్మాణంలో లోపభూయిష్ట విధానాల కారణంగా అదొక మురికి కాలువకు రూపుదిద్దుకుంది. దీని ఫలితంగానే ఈ అండర్ బ్రిడ్జీ కింద ప్రయాణించే మహిళలు మాన ప్రాణాలకు గురవుతున్నారు.. వర్షం సమయంలో మహిళలు అక్కడ నడుస్తున్న తీరు ..నడవాల్సిన పరిస్థితిని చూసే ప్రతి ఒక్కరి మనసు చివుక్కుమంటుంది.. గుండెలు పిండేస్తుంది.
కోకలు పైకెత్తుకుని నడవాల్సిన అగత్యం ….!
వర్షం లేనప్పుడు.. అక్కడ బురద ఆరినప్పుడు మహిళలకు ఏసమస్య ఉండదు.. మాన ప్రాణాలకు ముప్పేమి ఉండదు. అది నిజమే.. వర్షం వచ్చిందంటే అండర్ బ్రిడ్జీ ప్రాంతంలో నీరు చేరుతుంది. ఆ నీరు కూడా పట్టణంలోని కాలువలు గుండా వచ్చే మురికి నీరు.. నీరు ప్రవహించే సమయంలో అటు ఇటు బ్రిడ్జీ కింద ప్రయాణించాలంటే మహిళలు ఒకింత ఆందోళన.. మగవారు రాకుండా చూసుకోవాలి.. వస్తుంటే వెళ్లలేరు.. ఎందుకు వెళ్లలేరు అంటే..మొకాళ్ల వరకు చీరెను పైకి ఎత్తిపట్టుకోని ఆ నీటిలో నడవాలి.. అలా పైకి ఎత్తుకొని నడిచేటప్పుడు మగవాళ్లు వస్తే మానాలు పోతాయనే భయం ఇక్కడ ప్రయాణించే మహిళల్లో చోటుచేసుకుంటూ ఉంటుంది. కోకలు పై వరకు చేతపట్టుకుని మహిళలు వెళ్తున్న తీరు చూసిన ప్రతి ఒక్కరు కళ్లు మూసుకోవల్సిన దుస్థితి ఇక్కడ పాగా వేసింది. కోకలు పైకి ఎత్తుకోని నీళ్లలో నడవకుండా అటువైపు ..ఇటు వైపు వేసిన తాత్కాలిక రోడ్లు బురదమయమే.. అటు వెళ్లకుండా అష్టకష్టాలు పడి జాతీయరహదారి పైన నడుద్దాము అనుకుంటే ప్రాణాల సమస్య.. ఏ వాహనం కింద నలిగిపోతామనే ప్రాణ భయం.. ప్రాణాలు పోగొట్టుకునేకంటే మన మానాలు పోయినా పర్వాలేదులేదనుకుని ఈ మురికి నీటిలో కోకలు పైకెత్తుకొని వెళ్తున్నారు. వర్షాలు తగ్గినా అక్కడ చేరిన మురికి నీరు బురదగా మారినప్పుడు అందులో నడవాల్సిన రావడం మహిళలకే కాదు, యువతులకు, బాటసారులకు కష్టతరంగా ఉండిపోయింది. దేశానికి స్వాతంత్ర ఫలాలు లభించాయని అందరూ సభలు, సమావేశాలు నిర్వహించి సంబరాలు చేసుకుంటుంటే.. మాకు వచ్చిన ఫలాలు హరించబడ్డాయని ఇక్కడ వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ బతుకులు మాకేంటి అంటూ తెగ బాధపడుతున్నారు.. స్వాతంత్ర ఫలాలు హరించవేయబడటంలో ప్రధాన భూమిక పోషిస్తున్న ప్రజాప్రతినిధులతోపాటు, అధికారులను ఛీ కొడుతున్నారు.
మైదుకూరులోని మురికి ఇందుకు కారణమా..?
ఈ అండర్ బ్రిడ్జీకింద మురికి తిష్టవేయడానికి ప్రధాన మైన సమస్య మైదుకూరులోని మురికి నీరే.. సర్వాయపల్లె రోడ్డు ప్రాంతంనుండి వచ్చే మురికి నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు.. కాలువలు లేవు.. జాతీయ రహాదారికి అటువైపు ఇటు వైపు పెద్దవంకలు ఉన్నాయి.. అందులోకి ఈ మురికిని మళ్లించేప్రక్రియలేదు. అందువల్లనే అండర్ బ్రిడ్జీ వద్ద మురికి నీరు రోజుల తరబడి తిష్టవేస్తోంది. ముఖ్యంగా మహిళల మానాలను తీసేస్తుంది.
‘‘పురపాలిక అధికారి’’కి మాత్రం అవార్డుల మీద అవార్డులు….!
స్వాతంత్ర ,రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా అధికారయంత్రాంగం , ప్రభుత్వ యంత్రాంగం ప్రజాసమస్యల పరిష్కారం చూసే అధికారులను ఎంపిక చేసి అవార్డులు ఇస్తూ ఉంటుంది. అదే కోవలో మైదుకూరు పురపాలిక అధికారికి గత ఏడాది..ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ అవార్డు దక్కింది.. ఇదేంటి తమ స్వాతంత్ర ఫలాలు హరించి వేసి.. తమరిని మాన ప్రాణాలకు గురికాబడుతుంటే.. బాధ్యత కూడా పట్టని తమ అధికారికి అవార్డులు ఇవ్వడంను చూసి ఇదేనా మనకు లభించిన స్వాతంత్రం అంటూ ఈ ప్రాంత ప్రజలతో పాటు, ముఖ్యంగా మహిళలు, యువతీ యువకులు ముక్కున వేలేసుకుంటున్నారు.. పై అధికారుల తీరును చూసి ఛీదరింపులు వ్యక్తం చేస్తున్నారు.
‘‘గడప గడప’’ కు తిరిగినా.. మహిళల కష్టాల గురించి ఏకరువు పెట్టినా.. షరామామూలే..!
ఈ ప్రాంతంలో గడపగడపకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పురపాలిక అధికారులు తిరిగారు.. వారికి ఇక్కడి మహిళలు మాన ప్రాణాలకు గురవుతున్నారని తెలియజెప్పారు.. అండర్ బ్రిడ్జీ నిర్వాణంలో అధికారులు చేసిన తప్పిదం వల్ల మైదుకూరు- కమలాపురం ప్రాంతం మధ్యలోని పల్లెల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్ధానిక వైసీపీ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే వద్ద ఏకరువుపెట్టారు.. మైదుకూరు నుండి వచ్చే మురికి నీరు నియంత్రణ చర్యలు మాత్రం శూన్యం. చిన్నపాటి వర్షం వచ్చినా మురికి నీరు బ్రిడ్జీకిందకు చేరి ఏండిపోయింత వరకు మహిళలు కోకలు.. యువతులు లంగాలు పైకి ఎత్తుకుని అటు ఇటూ దొంగ చూపులు చూస్తూ నడవాల్సిన అగత్యం కొనసాగుతూనే ఉంది. తన పరిధిలో ఇలా మహిళలు మాన ప్రాణాలకు గురికావడం వల్లనే నాకు స్వాతంత్రదినోత్సవ అవార్డులు వస్తున్నాయనే భావన పురపాలిక అధికారిలో ఉన్నట్లుందేమో.. అందుకో ఇక్కడి మహిళల,యువతుల మాన ప్రాణాలు వ్యవహారం గాలికి వదిలేసినట్లుంది. రానున్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ అధికారికి మరో అవార్డు ఉన్నతాధికారులుకూడా సిద్దం చేసే పనిలో ఉన్నట్లు ఉంది...
( అండర్ బ్రిడ్జీ కింద మహిళలు మాన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని నడుస్తున్న తీరును ఫోటో తీద్దామని అనుకున్నా.. కానీ, మహిళల మానాలు కాలరాయలేక.. మిన్నకుండిపోయా)