➡️రాజోలి ఆనకట్ట ఎత్తు ఎత్తేవారే లేరా? నిర్మాణంపై ఎక్కుపెట్టేవారే లేరా?
➡️రాజకీయ నేతల ఎన్నికల అజెండా గానే రాజోలి ఆనకట్ట పరిమితమా.?
➡️ఆనకట్ట నిర్మాణంలోె ఏళ్లతరబడి నిర్లక్ష్యం.. 84,686 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం..?
-నందిరెడ్డినాగశివారెడ్డి,జర్నలిస్టు
ఎన్నికల్లో నిలబడే ప్రతి రాజకీయనాయకుడు… ప్రతి రాజకీయపార్టీ రాజోలి కథ ఎత్తే ప్రయత్నం చేయటం, ఆ కథను తలుచుకుని చెమటలు పట్టి వెనుదిరగటం.. ఎన్నికలప్పుడు ముందు రాజోలి సాధిస్తామంటూ తొడగొట్టే ధీరత.. అధికారం చేబట్టిన తరువాత సాధించలేక గుండెలు జారి బావురుమనడం ఇక్కడ ఆనవాయితీ అయింది. రోజోలి ఆనకట్ట సామర్థ్యం పెంచే దిశగా భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రాజోలి అటకెక్కగా.. కర్నూలు జిల్లాకుచెందిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి హయం నుండి నుండి రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబునాయుడు లాంటి ముఖ్యమంత్రులంతా రాజోలి సాధించలేక చివరకు పదవి నుండి వెళ్లిపోయారు.. గొప్ప గొప్ప ముఖ్యమంత్రులంతా రాజోలి ఆనకట్ట ఎత్తును ఎత్తే ప్రయత్నంలో తమ ఒళ్లు విరిగి, కళ్లు తిరిగి వెనక్కు వెళ్లారే కానీ.. సాధించి కేసీ రైతు కన్నీరు తుడవలేక పోయారు. రాజోలి ఆనకట్ట ఎత్తు పెంచేక్రమంలో సీతా స్వయం వరంలోగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల్లో ఆనకట్ట ఎత్తు ఎత్తేవారే లేరా? నిర్మాణం ఎక్కుపెట్టేవారే లేరా? అని కేసీ రైతులు ఢీలాపడుతున్న అంతలో మన జగనన్న లేచి తన తండ్రికి నమస్కరించి .. రాజోలి ఆనకట్ట ఎత్తును పెంచే ఉత్తర్వులు తెచ్చారు.. ఆధికారం వచ్చిన ఆరునెలలకే కేసీ ఆనకట్ట రైతాంగంవైపు ఓరకంటితో చూశారు.. ఆనకట్టను ఎత్తు పెంచే ధనబలంతో విల్లును ఎక్కుపెట్టారు. భూమి పూజతో రాజోలి అబ్బురపడింది. సభ అంతా జగనన్న, అవినాషన్న, రఘురాముడన్నలకు జయము జయము అని పలికింది.. ఇంకేముంది శంఖుస్ధాపన కార్యక్రమమంతా కమనీయం.. మూడేళ్లు గడిచింది.. ఇప్పుడు అధికారంలో ఉన్నవైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆనకట్ట ఎత్తునుఎత్తే సత్తా నాకే ఉందని ఆనాడు చెప్పారు.. ఆ దిశగా బలనిరూపణలో ఒకటి..రెండు కాదు.. మూడేళ్ల కాలం పూర్తయింది.. మరో ఏడాది కాలం.. ఆకాలంలో కూడా ఆనకట్ట ఎత్తును ఎత్తలేకపోతే మిగతా ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మోహన్ రెడ్డి చేరిపోక తప్పదనే భావన కేసీరైతాంగంలో ఉండిపోయింది.
కుందూనది రాజోలి ఆవశ్యకతః
ఆనకట్టలు (Dams) నదులకు అడ్డంగా నిర్మించిన కట్టడాలు. పెద్ద ఆనకట్టలు బహుళార్ధసాధకములైతే.. చిన్న ఆనకట్టలు నీటిని నిలువచేయడానికి ఉపయోగపడేవి.. కొన్ని ఆనకట్టలు వరద నీరు ఒక ప్రాంతం వైపు పారకుండా నిరోధించేందుకు కూడా నిర్మాణం జరిగింది..ఈ ఆనకట్టలను మానవులు నిర్మించవచ్చు లేదా సహజ సిద్ధంగా కూడా ఏర్పడవచ్చు. మానవ నిర్మితమైన ఆనకట్టలను వాటి ఎత్తును బట్టి లేదా వాటి అవసరాన్ని బట్టి వివిధ తరగతులుగా ప్రభుత్వాలు విభజిస్తాయి.. ఇందులో భాగంగా జలవనరుల శాఖ కడప జిల్లాలోని కేసీ కాలువ కింద 84,686 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కుందూ నది మీద రాజోలి ఆనకట్ట 234.640 కి.మీ వద్ద ప్రారంభమయి కేసీ ప్రధాన కాల్వ 305.860 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీనికి అనుబంధంగా 40.70 కి.మీ చాపాడు కాల్వతో పాటు 16 కి.మీ ఏటూరు కాల్వ, 24 కి.మీ కొండపేట ఉపకాల్వలు ఉన్నాయి. 1998లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. లైనింగ్తో పాటు అడుగుభాగంలో కాంక్రీట్ పరుపు వేశారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా కాలువ లైనింగ్ ప్రక్రియ పూర్తయింది. 1996-2004 సంవత్సర మధ్యకాలంలో 2000 కోట్ల రూపాయల ఖర్చుతో నవనీకరించారు.
జిల్లాలోని లక్షలాది మంది రైతుల గుండె సవ్వడి రాజోలి.. ఈ రాజోలి ఈ ప్రాంత రైతుల బతుకు దెరువు.. కేసీ కెనాల్ రైతుల పాలిట కల్పతరువు. జిల్లాలో 84,686 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్న ఒక పెద్ద ప్రాజెక్టు. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరినా కేసీ కాలువకు నీరు చేరే పరిస్థితి లేదుజ. నీరు విడుదల అయినప్పటికీ అవి పంట చేతికి వచ్చేవరకు వస్తాయో..మధ్యలో పంట ఎండబెట్టి చేతికందకుండా చేస్తాయో అటుఅధికారులకే కాదు..రైతులకు తెలియని దుస్థితి దశాబ్ధాలుగా ఉండిపోయింది. ప్రకృతి సహకరించినప్పుడు శ్రీశైలం నిండినప్పుడు నీరు విడుదల చేయడం జనవరి కి ముందే నీరు నిలుపుదల చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆగస్టు నుంచి ఏప్రిల్ చివరి వరకు విడుదల చేస్తే రెండు దఫాలుగా పంటలు సాగు నీరు అందాలంటే రాజోలి ఆనకట్ట సామర్థ్యం పెంచాల్సి ఉంది. వరద నీటికి అడ్డుకట్ట వేసి నీరు నిల్వ చేసుకోవడం వల్ల మన కేసీ కాలువ కింద 84,686 వేల ఎకరాలలో ఖరీఫ్, రబీలలో రెండు సార్లు పంటలు పండించుకునే సౌలభ్యం కేసీ రైతాంగంకు కల్గుతుంది. కేసీ కెనాల్కు ప్రతి సంవత్సరం నీరు వస్తుందా? లేదా అని సందిగ్ధం నుండి రైతాంగంను బయటవేసేందుకు ప్రతి ఏటా కేసీ రైతాంగంలో నెలకొనేది. ఈ సందిగ్ధం నుంచి రైతులును బయట వేసేందుకు రైతు బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి వైకుందూనదిపై రాజోలి ఆనకట్ట నిర్మాణం కోసం 2008 డిసెంబర్ 23న శంఖుస్థాపన చేశారు. మొదట రూ.300 కోట్లతో టీఎంసీ నీటిని నిల్వ ఉంచేలా నిర్మాణం చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 11 ఏళ్ల పాటు రాజోలి ఆనకట్ట గురించి ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు.
2019లో మళ్లీ డిసెంబర్ నెలలో రాజోలి ఆనకట్ట పనులకు శంఖుస్ధాపన..!
కేసీ (కర్నూలు కడప) కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా రూ.2.234కోట్ల అంచనా యంతో చేపట్టిన మూడుప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 డిశంబరు 23న కడప జిల్లా దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన చేశారు. రాజోలి ఆనకట్టతోపాటు కుందూ నదిపై కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణానికి రూ.312.3 కోట్లు, చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మాణానికి రూ. 1,357.10 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. కుందూ వరద
నీటిప్రవాహాన్ని ఒడిసి పట్టడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రభుత్వ ఆకాంక్ష. తుంగభద్రలో నీటి లభ్యత తగ్గడం.. సుంకేశులబ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 1.2 టీఎంసీలే కావడంతో కేసీ కెనాల్ కింద 2,65,628 ఎకరా
లకు నీళ్లందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో కుండూ వరద జలాలను కొత్తగా నిర్మించే జోలదరాశి, రాజోలి రిజర్వాయర్ల ద్వారా నీటిని ఒడిసి పట్టి రాజోలి ఆనకట్టకు దిగువన 84,686ఎకరాలకు నీళ్లందించి, మిగతా 1,80,912 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగ భద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పన..2.95 టిఎంసిల సామర్థ్యంతో రాజోలి ఆనకట్ట నిర్మాణంకు 9286 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. నంద్యాల జిల్లా గొట్లూరు గ్రామాలలో సర్వే జరుగుతోంది. ఇప్పటి వరకు 1745 ఎకరాలకు అవార్డు ప్రకటించారు. జీఎన్ఎస్ఎస్ అధికారులు ప్రత్యేక టీం సర్వే మూడేళ్లు పూర్తయినా ఇంకా ప్రారంభదశలోనే ఉన్నారు. నెమళ్లదిన్నె, బలపనగూడూరు, గరిశలూరు, చిన్నముడియం, ఉప్పలూరు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి ఈ గ్రామాల సర్వే తతంగం అటకెక్కింది..
రామా కనవేమిరా.. శ్రీరఘురామ కనవేమిరా..!
సీతాస్వయంవరం ప్రకటించాక జనకుని కొలువులోకి ప్రవేశించిన జానకీదేవిని, సభాసదులందరూ కన్నార్పకుండా చూస్తుండగా, శ్రీరామచంద్రుడు ఇంకా కన్నెత్తి చూడడేమిటా అన్న చెలికత్తెల అంతరంగంలోని సందేహానికి ప్రతీకగా ఈ హరికథాగానం బహు ప్రసిద్ధి. రాజోలి ఆనకట్టను2.95 టీఎంసీల సామర్థ్యంతో కట్టడానికి ప్రకటించడమేకాదు.. శిలాఫలకం వేశాక.. కేసీరైతులు ఆనకట్ట జాడ లేక తిరిగి రామా కనవేమిరా… అని పాడుకోవాల్సిన పాడుకాలం మళ్లీ దాపురించింది. దశాబ్ధాలుగా రాజోలి ఆనకట్ట పేరు చెప్పి ఓట్ల రాజకీయ సంస్కృతి ఓ ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది.. ఆపై ఏడాది అంటూ రైతులను మభ్యపెడటం రాజకీయ నేతలకు, ప్రభుత్వ పాలకులకు పరిపాటైంది. అధికారం లేనప్పుడు ఎన్నికల్లో లాభపడేందుకు అస్త్రం గా మార్చుకోవడం.. అధికారం చేజిక్కాక భూమిపూజల పేరుతో మభ్యపెట్టడంతో కేసీ రైతాంగం ఆందోనకు గురవుతోంది. నేతల డ్రామాలు రైతుల హృదయాలను కలచివేస్తున్నాయి.. “ఓ రఘురామా! రాజోలు వంక చూడవేమి ? రైతుల కంట కన్నీరు తుడిచేది.. పంటలు ఎండకుండా రక్షించేది.. ఖరీఫ్, రబీ సీజన్ లకు సాగునీరు అందించి ఆదుకునే రూపం కలది…భూమిసుత, జలకాంతులు, సవ్వడులతో మై మరిపించే రాజోలిని చూడవేమయ్యా.? అంటూ నిటూర్చుతున్నారు.
రైతు బిడ్డ ముఖ్యమంత్రి వైఎస్ రాజన్న రాజోలి ఆనకట్టకు భూమి పూజ కార్యక్రమం లో ఆనాడు.. భూమి పూజకు విచ్చేసిన రైతులే కాదు.. రైతు నాయకులు (వైసీపీ) తమ కళ నెరవేరుతుందనే ముసి ముసి నవ్వులతో మీసాలను మెలివేశారట.. రాజోలి పాధిస్తున్నామని పరాక్రమాలు పలికారట.. మా రఘరాముడికి సరిలేరు ఎవ్వరు అంటూ గర్వముతో పొంగిపోయారట.. మూడేళ్లు గడిచాయి.. ఎన్నికల రాబోతున్నాయి.. ఈ మూడేళ్లు మీసాలు తిప్పిన, పౌరుషాలు పలికిన వారందరికీ ప్రతిరోజు ఒక యుగంలా ఉత్కంఠత ( రాజోలి కట్టలేకపోయామే)ఉందట. రఘురాముడు వంక ..రాజోలి శిలాఫలకం వంక తన్మయులై కళ్లప్పగించి చూస్తుండి పోయారట.. పాపం వారి పౌరుషం మంట గలిచిపోతుంటే ఇంకేమి చేస్తారు..