➡️ 1693 లో కాలజ్ఞాన కర్త ” వీరబ్రహ్మం” సజీవ సమాధి..1918 లో సాధువు “సాయిబాబా” సమాధి..
➡️ సమాధి కాబడిన “షిరిడీ” అంతర్జాతీయ స్థాయిని అందుకుంటే… సజీవ సమాధి క్షేత్రం “కందిమల్లాయపల్లె” అభివృద్ధిలో అధమ పాతం ⁉️
➡️ కుటుంబ వారసత్వ పాలన తో “బ్రహ్మంగారి క్షేత్రం” అభివృద్ధికి విఘాతమా.. ❓
– నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు
బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.. 16 వ శతాబ్దము లో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి..హేతువాది.. సంఘ సంస్కర్త. అందువల్లనే ప్రపంచానికే జ్ఞానబోధ చేశారు. నాలుగ శతాబ్ధాల కిందటే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ ‘‘బ్రహ్మం’’ గారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. పఠిష్టమైన కుటుంబ వ్యవస్థ.. ప్రాచీన నాగరికత.. సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాలలో ఇలా చెప్పినవారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నా ‘‘బ్రహ్మంగారు’’ చెప్పిన ఒక్కో మాటా.. జరుగుతూ వస్తోందని అనేక మంది విశ్వసిస్తారు.. కొందరు స్వయంగా చూశారు కాలజ్ఞాన తత్వవేత్త వీరబ్రహ్మం గారి గొప్పతనం .
ఉత్తర భారత దేశం ఇంట సరస్వతీ నదీ తీరప్రాంతంలో జన్మించిన ‘‘ వీర బ్రహ్మం’’ తన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలకు చోటు దక్కింది. అనేక మంది దేవతల ప్రస్ధానం ఉండిపోెయింది. ఇంకో ఆశ్చర్యం గొలిపే గాంధి మహాత్ముని జననం ఆయన జాతిని కూడా కాలజ్ఞానంలో రచించారు.. ఆంగ్లేయ, మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక, రాజకీయ పరిణామాలు కాలజ్ఞానంలో పొందుపరిచారు. ప్రకృతి ప్రకోపాలు, వింతలూ, చోద్యాలు, బాబాల రాక వల్ల ప్రజల కష్టనష్టాలకు గురయ్యే విషయాలు లిఖించారు .. ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదేపదే పునరుద్ఘాటించారు కూడా.. కడప జిల్లా లోనికందిమల్లాయపల్లి లో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ( 1608 – 1693) నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము జీవ సమాధి పొందటు చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో ‘‘బ్రహ్మంగారిమఠం’’గా ప్రసిద్ధి చెందింది.
‘‘షిర్డీ ’’ తరహాలో అంతర్జాతీయ గుర్తింపు ఎందుకు లభించడం లేదు.?
16వ శతాబ్ధంలో ప్రపంచ పోకడలు గురించి కాలజ్ఞానం ద్వారా తెలియజెప్పిన మహిమాన్వితుడు వీార బ్రహ్మంగారు సజీవ సమాధి పొందిన బ్రహ్మంగారి మఠం ఎందుకు అంతర్జాతీయ గుర్తింపు అటుంచింతే .. జాతీయ గుర్తింపు కూడా లభించడం లేదనన్నది శేష ప్రశ్న. షిర్డీ సాయిబాబా ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు సాయిబాబా. 19 వ శతాబ్ధంలో సాయిబాబా మసీదులో నివసించాడు.. , 1918 అక్టోబరు 15 గుడిలో సమాధయ్యారు.. బ్రహ్మం గారూ 16వ శత్ధాబ్ధంలో జీవించి సజీవ సమాధయ్యారు.. మూడు శత్ధాబ్ధాలు ముందే సజీవ సమాధి పొందిన బ్రహ్మంగారి మఠం కనీస వసతులు దిక్కుమొక్కులేకుండా ఉండిపోతే.. 2017లోనే పుణ్యక్షేత్రమైన షిర్డీని అభివృద్ధి చేసేందుకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,200 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది.. ఆ కాలంలోనే అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ షిర్డీలో గణనీయ అభివృద్ధి చేశారు. శ్రీ సాయిబాబా ఆలయ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఫడ్నవీస్ హాజరయ్యారు. శ్రీ సాయిబాబా ఆలయ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహించారంటే షిర్డీ ఏ మేర అంతర్జాతీయ గుర్తింపు లభించిందో తెలిసిపోతోంది. షిర్డీ సాయిబాబా దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అనుగుణంగా నవీ ముంబైలోని నైనా (నవీ ముంబై ఎయిర్పోర్ట్-ప్రభావిత నోటిఫైడ్ ఏరియా) ప్రాజెక్ట్ తరహాలో అహ్మద్నగర్లోని షిర్డీ విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాన్ని చక్కటి ప్రణాళికతో కూడిన నగరంగా మహారాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ స్ధాయిలో విమానాశ్రయం చుట్టూ ప్రభావవంతమైన ప్రాంతానికి ‘ఆశా’ (షిర్డీ హబ్ విమానాశ్రయం చుట్టూ ఉన్న ప్రాంతం) అని కూడా పేరు పెట్టారు. అలా షిర్డీ పెద్ద పెద్ద భవనాలతో సుందరీకంగా రూపుదిద్దుకొంటే.. కాలజ్ఞాన కర్త వీరబ్రహ్మం సజీవ సమాధి కాబడిన ప్రదేశం మాత్రం దశాబ్ధాలుగా మన ప్రభుత్వాల వివక్షతకు గురవుతోంది.. మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో బ్రహ్మంగారి మఠంపై పూర్వ ఆంధ్రప్రదేశే కాదు.. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిన్నచూపుచూస్తున్నట్లు స్పష్టమవుతోంది. బ్రహ్మంగారి మఠం అన్నది ఒకటుందని గానీ..? ప్రపంచం పోకడలు, వర్తమాన భవిష్యత్తు గురించి కాలజ్ఞానం రచించిన బ్రహ్మంగారి గురించి కానీ..? వారు సజీవ సమాధి నిష్ట నేపధ్యం గురించి గానీ.. విశిష్టత ను మన ఇండియాప్రభుత్వంకు తెలియపరిచి బ్రహ్మంగారి క్షేత్రంను షిర్డీ తరహాలో అంతర్జాతీయ స్ధాయిలో చేయాలన్న చిత్తశుద్ది రాష్ట్రప్రభుత్వంలో లోపించిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. అంతేకాదు.. దేశ, జిల్లాల చరిత్రలను, పాలెగాళ్ల, దోపిడీ దొంగల గురించి లిఖించిన కైఫియత్తులో బ్రహ్మంకు చోటు లేకపోవడం కొసమెరుపు. అలాగే వేమన పద్యాలు, సాహిత్యంను గురించి తాళపత్ర గ్రంధాల్లోబ్రహ్మణులు ఎత్తి రాయించడంలో విశ్వబ్రహ్మణుడై వీర బ్రహ్మం పట్ల వివక్షత చూపారనే ప్రచారం ఉంది.
కుటుంబ పరిపాలన కొనసాగడం తోనే అభివృద్ధికి విఘాతమా..?
మాదిగ కక్కయ్యను\.. దూదెకుల సిద్దయ్యను ..గరిమరెడ్డి అచ్చమ్మను.. బ్రహ్మణ అన్నాజయను..ఛత్రియ ఆనంద భైరవయోగిని ఇలా అలా అన్ని కులాల వారిని ప్రాంతాల వారిని స్త్రీ పురుష బేధానికి అతీతంగా అందరిని ఒకే పంక్తిలో కూర్చోబెట్టి తనాతన ధర్మంలో సామాజిక సామరసతను ప్రపంచానికి గుర్తు చేసిన అసలైన సిసలైన సమతా మూర్తి వీర బ్రహ్మేంద్ర. అలాంటి బ్రహ్మంకు విశ్వ బ్రహ్మణుడు అనే మతం రంగు పిలువడం.. మఠం వ్యవహారం కుటుంబ పరిపాలన సాగిస్తుండటం వల్లనే అభివృద్ధికి విఘాతమనే ప్రచారం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ భక్తుడు సాయిబాబాకు బంగారు కిరిటాన్ని ఇచ్చాడు.. అదే తరహాలో వీరబ్రహ్మంకు కానుకలు సమర్పించే భక్తుల సంఖ్య తక్కువేమి లేదు.. కానీ , ఈ క్షేత్ర పరిపాలన బాధ్యతలు.. డబ్బుల వ్యవహారాలు.. నిర్వాహణ కుటుంబసభ్యుల చేతిలో ఉండటంతో పెద్ద పెద్దకానుకలు సమర్పించుకునే భక్తులు వెనకడుగు వేస్తున్నారనే వాదన అక్కడక్కడ వినిపిస్తోంది. బ్రహ్మంగారి మఠంపై ప్రభుత్వాలకు పర్యవేక్షణ బాధ్యత మాత్రమే కల్గి ఉండటం వల్ల అభివృద్ధి అటకెక్కుతోందనే విమర్శ ఉండిపోయింది..
ఫీఠం వివాదం తో మఠంలో రాజకీయ పెత్తనంకు చోటు..?|
వీరబ్రహ్మం వంశీకులు ఏడు తరాలుగా పీఠాన్ని అధిరోహిస్తూ వస్తున్నారు.ఈ తరాల్లో ఎన్నడూ ఎలాంటి వివాదం తలెత్తలేదు. కానీ ఆ కుటుంబంలో తరతరాల సంప్రదాయాలు పక్కనబెట్టి పీఠం కోసం నువ్వా నేనా అనే సైయ్యట తో రాజకీయం కూడా మఠంలో మకాం వేయగలిగింది. ఇటీవల శివక్యం పొందిన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రావతికి ఎనిమిదిమంది సంతానం. ఇందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. మొదటి భార్య అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో రెండవ వివాహం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి. రెండవ భార్య మారుతీ మహాలక్షమ్మమకు ఇద్దరు కుమారులు. ఈ నేపథ్యంలో తదుపరి పీఠాధిపతి స్థానం ఎవరికీ ఇవ్వాలనే అంశంపై ఆయన రాసిన వీలునామా పెద్ద రచ్చకు దారి తీసింది. ఒక విధంగా చెప్పాలంటే మఠం పరువు తీసిందిని చెప్పవచ్చు. పీఠాధిపతి పదవి నాకంటే నాకు అంటూ తల్లి బిడ్డలు గొడవకు దిగారు.. మొదటి భార్య మొదటి కుమారుడు వెంకటాద్రి స్వామికే పీఠాధిపతి పట్టం కడితే క్షేత్రం అభివృద్ధి చెందుతుందనే డిమాండ్ మఠం వాసుల్లో బలంగా వ్యక్తమైంది.మఠం విషయంలో ఎప్పుడు లేని విధంగా స్ధానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జోక్యంతో మఠం ప్రతిష్ట మంట గలిచిందనే వాదన వినపడింది. బ్రహ్మంను దర్శించుకోవడం.. కాలజ్ఞానం గురించి పీఠాధిపతి ద్వారాతెలుసుకునే వరకే పరిమవుతూ వచ్చిన నేతలంతా.. పీఠాధిపతి వ్యవహారంలో చివరకు పెత్తనం చేసే వరకు వెళ్లడమే కాదు.. పీఠాధిపతిని నియమించే స్ధాయికి చేరిపోవడం తీరు ఆసమయంలో పెద్ద చర్చకు దారి తీసింది. పూర్వపు పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి పెద్దకుమారుడు వెంకటాద్రి స్వామియే బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతిగా నియమించే స్ధాయిలో పంచాయితీలు జరిగిపోయాయి.. రాజకీయ జోక్యాలు మితిమీరిపోయాయి.. చివరకు కోర్టులో వివాదం వల్ల పీఠాధిపతినియామకంలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది.. పీఠాధిపతి నిమాయం రాజకీయ నేతల వల్ల జరిగిపోతే ఇక మఠం క్షేత్రం రాజకీయ శిబిరంకు వేదిక అవుతుందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.
బస్ షెల్టర్ కు దిక్కులేని ‘‘బ్రహ్మంగారిమఠం’’..!
శతాబ్ధాల కిందట కాలజ్ఞానం తో చరిత్ర స్పష్టించి సజీవ సమాధిలో నిష్ట వేసిన బ్రహ్మంగారి మఠంకు వచ్చిపోయే ప్రయాణికులు నిలువ నీడ కల్పించే బస్టాండు కాదు కదా.. కనీసం బస్ షెల్టర్ లేదు.. దాతలు సహకారంతో నిర్మాణంకు నోచుకున్న బస్ షెల్టర్ ను అభివృద్ధి మంత్రంపేరుతో స్ధానిక ప్రజాప్రతినిధులు కూల్చివేశారు.. తర్వాత శఠగోపం పెట్టారు.బ్రహ్మంగారిమఠానికి శతాబ్ధాల చరిత్ర ఉన్నప్పటికీ.. ఆ చరిత్రకు తగినట్లు అభివృద్ధి లేదు.. మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు బ్రహ్మంగారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.. కాల కృత్యాలు తీర్చుకోలేక మానసిక వేదనకు గురవుతున్న భక్తుల సంఖ్యే ఎక్కవగా ఉంటుంది. మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు లేవు.. భక్తుల మధ్యనే అది ఆడనా? మగనా? అని పట్టించుకోకూడదు.. వారి వైపు చూడకుండా బట్టలు మార్చుకునే దీన స్థితి మఠంలో ఉండిపోయింది. దప్పిక తీర్చుకునేందుకు రుచికరమైన నీళ్లు దొరకవు.. నీటిశుద్దియంత్రాలు పనిచేయవు.. చేసినా అందరికీ అందవు.. బయట అంగళ్లలో కొనుకోవడమో.. కుళ్లాయిలకువచ్చేనీరు దప్పిక తీర్చుకోవడమే.. మఠంకు విచ్చినప్పుడు సేదతీరే సత్రాలు కనపడతాయి.. అందులో శుభ్రత ఉండదు.. ఇలా చెప్పుకుంటూ వెళ్లితే తినడానికి సరైన తిండి కూడా దొరకదు.. ఆలయం అన్నదానం నిర్వహిస్తున్న కొందరికే ఆ అన్నము దక్కుతుంది.. కడపు మార్చుకోకుండా నాలుగు మెతుకులు తిందామన్నట్లు.. మఠం క్షేత్రం ప్రగతిగురించి ఒక్కమాటలో వర్ణిస్తే.. ఇక్కడ భక్తుల కంటే పందులు, కోతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పడంలో అతియోశక్తి లేదు.. కుటుంబ పాలన తీరుతెన్నులు.. వారి విధాన నిర్ణయాలు.. ఒంటెత్తు పోకడలు వల్ల మఠం క్షేత్రం కూనారిల్లుతోందనే భావన భక్తుల్లో వ్యక్తమవుతోంది. నాలుగు శతాబ్ధాల చరిత్రకల్గిన మఠం క్షేత్రంతోపాటు.. పరిసరాలు.. ఆ ప్రాంతం ఓ సాధారణ పల్లెటూరు తరహాలో ఉండిపోవడము చూస్తే వీరబ్రహ్మం వంశీకులు ఏడు తరాలుగా పరిపాలన తీరు ఏపాటిదో్ కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంది .. ఇదేనా కాలజ్ఞాన కర్త వీరబ్రహ్మం సజీవ సమాధి ప్రదేశం అన్నది సందేహం కలిగి తీరుతుంది..