*దినదినాభివృద్ధి చెందుతున్న దువ్వూరులో.. ప్ర‌యాణికుల‌కు నిలువ నీడ‌లేదు..
* బ‌స్టాండ్ కై ప‌దివేల మంది సంత‌కాలు..
* ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పోస్టుకార్డుల ద్వారా బ‌స్టాండ్ ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేసిన దువ్వూరు ప్ర‌జ‌లు
*మూడేళ్లుగా బీజేపీ ‘‘ ప్ర‌జా ఉద్య‌మం’’..

-నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు

‘‘దుర్వాస మహర్షి తపమాచరణతో దువ్వూరుకు పాలేగాండ్లు, నవాబులచే పరిపా లించబడి… బ్రిటీష్ పాలనలో తాలూకా కేంద్రంగా ఉండింది’’. దువ్వూరు మండల కేంద్రానికి ఒక‌ కి.మీ. దూరములో పాత దువ్వూరు . కృతయుగమున దుర్వాస మహర్షి తపమాచరిస్తుండగా పేరు లేని ఈ ఊరికి పేరుపెట్టాలని పెద్దలు కోరగా.. అందులకు దుర్వాసుని ఊరుగా నామకరణం చేసినట్లు చరిత్రను బట్టి తెలుస్తుంది. ఇప్పుడ‌ది దువ్వూరుగా దిన‌దినాభివృద్ధి చెందుతోంది.

గ‌ణ‌మైన చ‌రిత్ర క‌ల్గిన దువ్వూరు మీదుగా క‌ర్నూలు- క‌డ‌ప జాతీయ‌ర‌హ‌దారి వెళ్తుంది. వాణిజ్య వ్యాపారంలో పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ప్రొద్దుటూరుకు దువ్వూరు కేంద్ర బిందువులాంటింది. హైద‌రాబాద్ నుండి ప్రొద్దుటూరు వ‌చ్చి వెళ్లే ప్ర‌యాణికులు దువ్వూరు త‌గిలి వెళ్తుంటారు. మండ‌ల కేంద్ర‌ముగా ప‌రిగ‌ణించ‌బ‌డుతున్న దువ్వూరుకు అనుబంధంగా పాతిక పైగా గ్రామాలున్నాయి.. అందువ‌ల్ల‌నే గ్రామీణ నేప‌థ్యం క‌ల్గి ఉంటుంది. కానీ, గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల‌తో నిత్యం ముడిప‌డి ఉండే దువ్వూరులో బ‌స్టాండ్ సౌక‌ర్యం బొత్తిగా లేదు.. కాలం ముందుకు వెళ్తున్నా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు లేవ‌నే చెప్పాలి.


                                    ప‌ల్లెల జీవ‌నంతో నిత్యం ముడిప‌డే దువ్వూరు.. అదే త‌ర‌హాలో ప‌ల్లె జ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. పొద్దు పొడ‌వ‌గానే దువ్వూరుకు వ‌చ్చే ప‌ల్లె జ‌నం సంఖ్య త‌క్కువేమి ఉండ‌దు.. క‌ర్నూలు వెళ్లాల‌న్నా.. క‌డ‌ప వెళ్లాల‌న్నా.. ప్రొద్దుటూరు వెళ్లాల‌న్నా దువ్వూరుకు ఆప‌ల్లె జ‌నం చేరుకొని తీరాల్సిందే.. దువ్వూరు మీదుగా వెళ్లే బ‌స్సుల రాక‌పోక‌లు అధిక‌మే.. అన్ని ఉన్న ప‌ల్లె జ‌నంకు కాసింత సేద‌తీరేందుకు నీడ ఉండ‌టం లేదు. బ‌స్సులు ఎక్కే క్ర‌మంలోనూ.. దిగే క్ర‌మంలోనూ రోడ్డుతో స‌హ‌వాసం చేయాల్సిన అగ‌త్యం ద‌శాబ్ధాలుగా ఉండిపోయింది. బ‌స్సు కోసం నిరిక్షించే ప‌ల్లె జ‌నంకు ఆల‌స్య‌మైనా.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కాల కృత్యాలు తీర్చుకునే వ‌స‌తి లేదు.. అలాంటి స‌మ‌యంలో ఇబ్బందుల‌కు గుర‌య్యే గ్రామీణ మ‌హిళ‌ల గురించి ఆలోచన కూడా ద‌శాబ్ధాలుగా ఎవ్వ‌రికీ రానట్లుంది. దీని వ‌ల్ల మ‌హిళ‌ల క‌ష్టాలు క‌డ‌తేర‌లేని ప‌రిస్థితి.

పోలీసుస్టేషన్ క్వార్ట‌ర్స్ లో ‘‘బ‌స్టాండ్’’ నిర్మాణం కోసం..!

మండ‌ల కేంద్రంలోని కూడ‌లిలో నిరూప‌యోగంగా పోలీసు క్వార్ట‌ర్స్ స్థ‌లం ఉంది.. ర‌మార‌మి 60 సెంట్లు స్థ‌లం.. క్వార్ట‌ర్స్ శిధిలావ‌స్ధ‌కు చేరుకున్నాయి. కూడ‌లిలో పోలీసుక్వార్ట‌ర్స్ స్థ‌లం నందు బ‌స్టాండ్ నిర్మిస్తే ఎంత బాగుంటుందో అన్న ఆలోచ‌న బిజేపీ పార్టీ నేతలో మొద‌లైంది.. కేంద్రంలో అధికారంలో ఉన్నది మ‌న‌పార్టీనే క‌దా.. మ‌న పార్టీ దృష్టి పెడితో ప‌ల్లె జ‌నం కోసం అవ‌స‌ర‌మైన బ‌స్టాండ్ నిర్మించ‌డం చాలా సుల‌భ‌త‌ర‌మ‌నుకున్నారు బిజేపీ రాష్ట్ర‌కార్య‌వ‌ర్గ స‌భ్యుడు ఆర‌వేటి హ‌రిక్రిష్ణ‌. బ‌స్టాండ్ నిర్మాణం కోసం ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం క‌ల్పించే దిశ‌గా 2021లో ప్ర‌జాఉద్య‌మం ఆరంభించారు. మొద‌ట సైన్ గుడ్డ మీద ప్ర‌జ‌ల‌చే సంత‌కాలు చేప‌ట్టే దిశ‌గా దువ్వూరులో కార్యక్ర‌మం ఏర్పాటు చేశారు.. ప్ర‌జ‌ల నుండి స్పంద‌న బాగానే ఉండిపోయింది.. ఏకంగా మొద‌టి రోజే సైన్ గుడ్డ‌పై ఆరువంద‌ల మంది ప్ర‌జ‌లు సంత‌కాలు చేశారు.. బ‌స్టాండ్ నిర్మాణం ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌జ‌ల ద్వారానే హ‌రికృష్ణ తీసుకెళ్లారు.

సైన్ గుడ్డ నుండి ప‌దివేల సంత‌కాలు సేక‌ర‌ణ వ‌ర‌కు ‘‘ఉద్య‌మం’’..

దువ్వూరు ప్రాంత గ్రామీణ ప్ర‌జ‌లను ఈప్ర‌జా ఉద్య‌మంలో భాగ‌స్వామ్యుల‌ను చేసేందుకు ప‌దివేల సంత‌కాలు సేక‌రించే ఉద్య‌మంకు బిజేపీ రాష్ట్ర‌కార్య‌వ‌ర్గ స‌భ్యుడు ఆర‌వేటి హ‌రిక్రిష్ణ శ్రీకారం చుట్టారు..దువ్వూరు ప్రాంతంలోని ప్ర‌తిప‌ల్లెను త‌ట్టారు.. ప్ర‌తిప్ర‌జ ఈ ఉద్య‌మంకు నేను సైతం అంటూ సంత‌కం పెట్టి సంఘీభావం తెలిపాడు. అర‌వై రోజుల్లో ప‌దివేల మందిని ఈ ఉద్య‌మంలో భాగ‌స్వామ్యం చేయ‌గ‌లిగారు ఆర‌వేటి హ‌రిక్రిష్ణ‌. ఆర్టీసీ బ‌స్టాండ్ నిర్మాణంను పోలీసుస్టేష‌న్ క్వార్ట‌ర్స్ స్థ‌లంలో నిర్మించాల‌నే దువ్వూరు మండ‌ల ప్ర‌జ‌ల డిమాండ్‌ను.. వారి ఆకాంక్ష‌ను మండ‌ల అధికారుల నుండి జిల్లాక‌లెక్ట‌ర్ వ‌ర‌కు.., ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌కు త‌న విన్న‌పాల ద్వారా హ‌రిక్రిష్ణ విన్న‌వించారు.., బ‌స్టాండ్ నిర్మాణ ఆవ‌శ్య‌కత గురించి తెలియ‌జేశారు.. 2021 నుండి మూడేళ్ల పాటు ప్ర‌జాఉద్య‌మం న‌డిపిస్తున్న ఆచ‌ర‌ణ‌లో అడుగుకూడా ముందుకు వేయ‌డంలేదు. ఆనాటి నుండి ఆ డిమాండ్ అట‌కెక్కి ఉంది.

బ‌స్టాండు కోర‌కు ‘‘ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్’’ కు పోస్టు ద్వారా విన్న‌పం…

‘‘మండ‌ల కేంద్ర‌మైన దువ్వూరులో ఏపీఎస్ఆర్టీసీ బ‌స్టాండు సౌక‌ర్యం లేదు. ఎండ‌కు, వాన‌కు , గాలికి రోడ్డుకు ఇరువైపులా గ్రామంలో బ‌స్సుకోసం ప్ర‌యాణికులు గంట‌ల కొద్ది నిల‌బ‌డి వ‌స్తున్న‌ది. మ‌హిళా ప్రయాణికుల‌కు క‌నీసం దువ్వూరు సెంట‌ర్ లో మ‌రుగుదొడ్డి,మూత్ర విస‌ర్జ‌న సౌక‌ర్యం లేదు.. దువ్వూఉరు సెంట‌ర్ లో స‌ర్వేనెంబ‌రు 1356 నందు 60 సెంట్లు ఉంది.. అందులో ఏర్పాటు చేసిన పోలీసు క్వార్ట‌ర్స్ నిరూప‌యోగంగా ఉన్నాయి. ప్ర‌జాప్ర‌యోజ‌నాల కోసం ఆస్థ‌లంలో ఏపీ ఆర్టీసీ సంస్థ బ‌స్టాండుకు స్థ‌లం కేటాయించాల‌ని కోరుతున్నాము. మీరు సానుకూలంగా నిర్ణ‌యంతీసుకోవాల‌ని వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నాము’’.. అంటూ మండ‌లంలో సుమారు 16వంద‌ల మంది ప్ర‌జ‌లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పోస్టు కార్డు ద్వారా తెలియ‌జేశారు.. అంత సంఖ్య‌లో త‌మ విన్న‌పంను ముఖ్య‌మంత్రికి తెలియ‌జేసినా బ‌స్టాండ్ ఏర్పాటు విష‌యంలో ఏప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు.

బ‌స్టాండు కోసం ఆర్టీసీ ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే స్థ‌లంప‌రిశీలించినా..?

దువ్వూరులో ఆర్టీసీ బ‌స్టాండు కోరకు ప్ర‌జా ఉద్య‌మం న‌డుస్తున్న త‌రుణంలో ఆర్టీసీ సంస్థ ఛైర్మ‌న్ మ‌ల్లిఖార్జున రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి బ‌స్టాండు స‌మ‌స్య‌ను గుర్తించిన‌ట్లు ఉంది.. దువ్వూరుకు విచ్చేశారు.. పోలీసు క్వార్ట‌ర్స్ స్థ‌లంలో బ‌స్టాండు క‌ట్టాలంటే పోలీసు శాఖ అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి.. ఆ అనుమ‌తి క‌ష్ట‌మ‌నుకున్నారో ? ఏమో? దువ్వూరు స‌మీపంలోని జాతీయ‌ర‌హ‌దారి వ‌ద్ద ఆంజ‌నేయ స్వామి గుడి వ‌ద్ద 50 సెంట్ల స్థ‌లంలో బ‌స్టాండ్ నిర్మిస్తేబాగుంటుంద‌ని త‌మ ప‌రిశీల‌న‌లో ఆమోద ముద్ర‌కూడా వేసేశారు ఛైర్మ‌న్‌, ఎమ్మెల్యే లిద్ద‌రు.. అయితే, ఆస్థ‌లంలో బ‌స్టాండ్ నిర్మాణం సాధ్యంకాదంటూ జిల్లాక‌లెక్ట‌ర్‌కు త‌హశీల్ధారు రిపోర్టు ఇచ్చిన నేప‌థ్యంలో ఆ ప్ర‌ణాళిక అట‌కెక్కిన‌ట్లేనా అన్న‌ది ప్ర‌జాప్ర‌తినిధులు,అధికారులు నిగ్గు తేల్చాల్పి ఉంది. దువ్వూరు గ్రామీణ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేప్పాల్పిన ఉంది.