‘వగరస్తూ గుండెదాక పగిలింది నేలా…
సెగలొచ్చీ పొగలొచ్చీ సొగసిందీ నేలా..
అడుగడుగున బంగారం, ఆకుపచ్చని సింగారం…
తొడుగమ్మా ఈనేలకు సస్యశ్యామలం వేషం’’…
ఎప్పుడో నాలుగున్న‌రేళ్ల దశాబ్దాల కిందట ‘‘ఉండమ్మా
బొట్టుపెడతా’’ చిత్రానికి దేవుళ్లపల్లి కృష్ణశాస్త్రిగారు రాసిన పాట ఇది.

-నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు

ఆ మహాకవి సూచించినట్లు కేసీ కెనాల్ నీటి ప్రాజెక్టుగా రూపుదిద్దక మునుపు , తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం మునుపు మైదుకూరు ప్రాంతం కరువుకు పుట్టినిల్లు. పల్లె సీమలపై ప్రకృతి కన్నెర చేసింది. కరవు ధాటికీ అనాధసీమలయ్యాయి. ఒకసారి వర్షాభావం, మరోసా అతివృష్టి సృష్టిస్తూ వ్యవసాయంను యమపాశంగా మార్చి వేసింది. ఏవిత్తనం వేసినా.. ఆవిత్తు భూమిలో మొలవక మునుపే నాశనమయ్యేది. రైతు నుండి భూస్వాములను కరవు రక్కసి కబళించింది.. రొమ్ము విరుచుకుని తిరిగిన ఆసామి సైతం చతికలపడ్డాడు. పొట్టగడవని స్థితిలో రైతు కూలీలు పనులకు వ‌ల‌స‌ దారి పట్టారు. మూగజీవాలకు గుప్పెడు గడ్డి అందించలేని దుస్థితి. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడి భూములు కళకళలాడ్డానికి అవసరమైన నీరు అందుబాటులోకి వచ్చింది. అదనులో వర్షం..పదనులో విత్తనం విత్తినప్పుడే అడుగడుగునా బంగారు పండుతుందనే నానుడిని నిజం చేస్తూ ఖరీఫ్, రబీ సీజన్ పరుగులు తీస్తున్నాయి.

మైదుకూరు ప‌సుపుకు అంత‌ర్జాతీయ ఖ్యాతి…

సుగంధ ద్రవ్య పంటలలో భారతదేశంలో పసుపు పంట ప్రధానమైనది. మన దేశములో సగానికి సగం పసుపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉత్పత్తి అవుతుంది. పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనము (కర్కుమిన్) మరియు సుగంధతైలము (2.6%) వలన దీనిని ఆహార పదార్ధాలకు రంగు, రుచి, సువాసనల కొరకు ఔషదాలలో, చర్మ సౌందర్యానికి మరియు రంగుల పరిశ్రమలలో వాడుతారు.

భారతీయుల జీవన సరళిలో, ఆహార వినియోగంలో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. పసుపును శుభ సూచికంగా భావించే హిందూ సమాజంలో తెలుగు వారి పాత్ర ప్రత్యేకమైంది. ఇక్క‌డ మన సార‌వంత‌మైన సారవంతమైన, అపార జల సంపదతో కూడిన భూముల్లో అత్యధిక మంది రైతులు పసుపును ఎంతో ఉత్సాహంగా పండించడంతో పాటు, గృహ అవసరాలకు దాన్ని వినియోగించడం ద‌శాబ్ధాలుగా కొన‌సాగుతోంది..దేశంలో టేకూరిపేట, సేలం, దుగ్గిరాల, మైదుకూరు రకాల ప‌సుపు పంట సాగు రైతులు చేప‌డుతున్నారు.. ద‌శాబ్ధాలకు పైగా మైదుకూరు ర‌కం పసుపు ప్రాచుర్యంలోకి వచ్చి, దేశీయ మార్కెట్‌లో తన సత్తాను నిరూపించుకొంటోంది. అంత‌ర్జాతీయ మార్కెట్లో మైదుకూరు ప్రాముఖ్య‌త‌ను ఇనుమ‌డింప చేస్తోంది.. అనాధిగా మైదుకూరు ర‌కం ప‌సుపు పండించ‌డం రైతులకు ఎంతో ఇష్టమైన వ్యవహారం. ఇక్క‌డి రైతులు అధికంగా ప్రేమించి, సాగు చేసుకునే మైదుకూరు పసుపు రకం ప్రభుత్వాల వైఫల్యం కారణంగా  కనుమరుగైపోతోంది. అంతర్జాతీయ స్ధాయి అందుకున్న క్రమేపి అంతరించిపోతోంది..

నానాటికి అంత‌రించిపోతున్నా మైదుకూరు ప‌సుపు…

నెల రోజుల వ్యవధిలో రైతన్న ఆశ నిరాశగ. మారింది. ఒక క్వింటా పసుపు 2 వేలకు పైగా ధర తగ్గి రైతుల కన్నీటిని మిల్గిల్చేలా చేసింది. గత నెలలో క్వింటాకు రూ. 8300ల ధర పలుకగా ప్రస్థుస్తాం 5 నుంచి 6వేల రూపాయలు పలకడం కష్టంగా మారుతోంది. చిన్న గాయం తగిలిన పసుపును పూసి బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందుతాం.. ప్రతి వంటలో పసుపు లేకుంటే అసలు రుచే రాదు. కానీ పసుపును పండించే రైతులకు మాత్రం పసుపు గిట్టుబాటు ధర లేకుండా మనసుకు గాయంగా మారుతున్నాయి. వంటలో రుచేమో గానీ., ఆరుగాలం కస్టపడి పండించిన పంటకు సరైన ధర లేకుండా చేదును చవిచూసేలా చేస్తున్నాయి. పసుపు ధర ఈ యేడాది మొదవలవ్వడం నుంచి హోరెత్తి రైతు కళ్ళలో ఆనందాన్ని నింపగా… జూన్ నెల వచ్చేసరికి ఉసూరుమనిపిస్తున్నాయి. సరిగ్గా రెండు నెలల క్రితం ఓ స్థాయికి చేరి 10 వేల వరకు ధర పెరుగుతుందనుకుంటున్న తరుణంలో పతనమవ్వడం కడప జిల్లా పసుపు రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

దివంగ‌త నేత వైఎస్ఆర్ పాల‌నలో లాగా మ‌ళ్లీ ప‌సుపుకు ధ‌ర వ‌చ్చేనా..?

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌లో ప‌సుపుకు మంచి గిట్టుబాటు ధ‌ర వ‌చ్చింది.. ఆ త‌ర్వాత పసుపు ధ‌ర‌లు ప‌త‌న‌ద‌శ‌కు చేరుకుంటూ వ‌స్తున్నాయి.. ధ‌ర అటుంచితే… కోనుగోళ్లు లేక పసుపునే ఏళ్ల త‌ర‌బ‌డి మార్కెట్ యార్డుల్లోనే ప‌సుపు నిల్వ‌లు పేరుకుపోయాయి.. మార్కెట్ యార్డు అద్దెలు చెల్లించేందుకు కూడా ధ‌ర లేని ప‌రిస్థితుల్లో అక్క‌డే కొంద‌రు రైతులు వ‌దిలేసుకున్నారు.. మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉన్న ప‌సుపు పంట ఉత్ప‌త్తుల గురించి మ‌రిచిపోయారు కూడా.. మ‌న ప్రాంత
పసుపు రైతాంగానికి గ‌త మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేని దుస్థితి.. పంట చేతికంద‌ని స‌మ‌యంలో ధ‌ర‌ల పెర‌గ‌డం.. పంట చేతికందాక ఆమాంతం ప‌డిపోవ‌డం రైతును కన్నీటి ప‌ర్యంతం చేస్తోంది.

రైతుల ఆవేద‌న ఆకాశాన్నిఅంటుతోందా..?

గత రెండు మూడు ఏళ్ళు తీవ్ర నష్టాన్ని చవిచూసినప్ప‌టికీ రైతన్నలు అవన్నీ దిగమింగుకుంటూ ఈ ఏడాది పసుపును సాగు చేశారు.. మ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు మండ‌లాల‌తో పాటు, ప్రొద్దుటూరు, రాజుపాలెం , ఒంటిమిట్ట, రాజంపేటమండలాల్లో అత్యధికంగా సాగుచేశారు .. ప‌సుపు సాగుకు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి.. ఆరుగాలం క‌ష్టించి పండించిన‌ప్ప‌టికీ దిగుబ‌డులు మార్కెట్‌కు వ‌చ్చే త‌రుణంలో ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.. 2021 ఆగ‌స్టులో క్వింటా ధర 8,300కు పైనే పలకగా.. అనంతరం 10 వేల వరకు ధర పలుకుంతున్న సంకేతాలు మార్కెట్ వర్గాల నుంచి వచ్చాయి.

అయితే ధర అక్కడి నుంచి ఎమైందో కానీ ధర పెరగకపోగా నెలన్నర రోజుల్లోనే 2 వేలకు పైగా ధర తగ్గింది. మరోవైపు గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి తగ్గడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. సీఎం జగన్‌ సొంత జిల్లాలో రైతుల ఆవేదన ఆకాశానికి అంటుతోంది. కడప జిల్లాలో 7వేల హెక్టార్లల్లో పసుపు సాగుచేస్తారు… కర్నూలు జిల్లాలోనూ చాగలమర్రి, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం మండలాల్లో పసుపు సాగుచేస్తున్నారు. ఎకరాకు 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి రైతులు పసుపు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తుంది. కానీ గతేడాది వర్షాల వల్ల పంట బాగా దెబ్బతింది. ఎకరాకు 10-15 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదని ప‌సుపు రైతులు వాపోతున్నారు.

 

రెండేళ్లుగా పసుపు కొనుగోళ్లు … కానీ!

గ‌త రెండేళ్లు మైదుకూరు వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డులో కొనుగోలు పసుపు కొనుగోలు కేంద్రం రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.. 2021లో మైదుకూరు మార్కెట్ యార్డు ప‌సుపు కొనుగోళ్లు జ‌రిపిన‌ప్ప‌టికీ పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.. ప్ర‌తిప‌క్ష పార్టీతోపాటు, అధికార‌పార్టీలోని వారే దువ్వూరుకు చెందిన వైసీపీ నాయ‌కుడి చేతి వాటంతో రైతుల‌కు న‌ష్టం వాటిల్లింద‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తును చెల‌రేగాయి.. 2022 లో మార్కెట్ యార్డు నందు కొనుగోలు కేంద్రం పెట్టిన‌ప్ప‌టికీ ప‌సుపు కొనుగోళ్ల విష‌యంలో అల‌వికాని నిబంధ‌న‌ల కార‌ణంగా రైతులు త‌మ ప‌సుపు ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోలేక పోయారు.. ఈ ఏడాది పంట ఉత్ప‌త్తులు ఇప్పుడిప్పుడే రైతు చేతికందుతున్నాయి.. గడిచిన మూడేళ్లుగా మార్కెట్‌లో ధర లేదు.రాష్ట్ర ప్ర‌భుత్వ సంస్థ మార్క్‌ఫెడ్ మైదుకూరులో మార్కెట్‌లో కోనుగోళ్లు చేప‌ట్టినా ఏ మాత్రం ప్ర‌యోజ‌నం క‌ల్గించ‌ని దుస్థితి…

ఈ ఏడాది పుసుపు కొనుగోలు కేంద్రం కోసం అసెంబ్లీలో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి …

గ‌త రెండేళ్ల త‌ర‌హాలోనే ఈ ఏడాది మార్కెఫెడ్ మైదుకూరులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి అసెంబ్లీలో ప్ర‌భుత్వంను కోరారు.. దీనిపై స్పందించిన వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌సుపు కొనుగోలు కేంద్రంకు అనుమ‌తి ఇచ్చింది.. గిట్టుబాటు ధ‌ర లేని స‌మ‌యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు ప్ర‌క్రియ రైతుల్లో ఆనంద వ్య‌క్త‌మ‌వుతుండ‌గా.. మ‌రో వైపు గ‌తేడాది లాగే నిబంధ‌న‌లు పెడితే ప్ర‌యోజ‌నం ఏమిట‌నే ప్ర‌శ్న ఆదే రైతుల్లో ఉత్ప‌న్న‌మ‌వుతోంది.. ప్రభుత్వం పసుపు సేకరణలో అలివికానా షరతులు విధించే క్ర‌మంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఉప‌యోగం లేద‌నే వాద‌న వ్య‌క్త ప‌రుస్తోంది రైతాంగం.

కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్ర‌భుత్వం నుండి అనుమ‌తి ల‌భించ‌డ‌మైతే లభించింది కానీ, ప‌సుపు కొనుగోళ్ల‌లో నిబంధ‌న‌లు, గిట్టుబాటు ధ‌ర ఏమాత్రం ల‌భిస్తుంద‌న్న‌ది ఇంకా నిర్దారించ‌లేదు.. ఆదిశ‌గా రైతుల నుండి అభిప్రాయాలు తీసుకున్న దాఖ‌లాలు లేవు.. ప్రభుత్వం నామమాత్రంగా మాత్రమే ధరలు పెంచి, కోనుగోలులో అల‌వికానీ షరతులు విధిస్తే గ‌తేడాది లాగా ఏ ఒక్క రైతు త‌ము పండించిన ప‌సుపు ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోలేడు.. గ‌త ఏడాది కొనుగోలు కేంద్రం తీరు తెన్నుల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని రైతులు పంట‌ను గిట్టుబాటు ధ‌ర‌కు అమ్ముకునే విష‌యంలో నిబంధ‌న‌ల్లో స‌డ‌లింపు ఉండేలా చూడాల‌ని ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డికి పుసుపు రైతాంగం విన్న‌వించుకుంటోంది..