టీడీపీ (TDP) జగన్ సర్కార్‌ టార్గెట్‌గా కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఇప్పటికే బాదుడే బాదుడు అంటూ ప్రజల్లోకి వెళుతున్న తెలుగు దేశం.. తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు.. వైఎస్సార్‌సీపీకి పోటీగా ‘ఇదేం ఖర్మ’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తోంది.. ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌కు సూచించారు. నియోజకవర్గాల్లోనూ వెంటనే ప్రారంభించి ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు కూడా. బాధిత ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డే ఈకార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశ్య‌మంటోది తెలుగుదేశం పార్టీ..

-నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు

మైదుకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులకు – మరియు కార్యకర్తలకి_ తెలియచేయటం ఏమనగా..

మన ప్రియతమ ఇన్‌చార్జ్ *శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్* గారి ఆదేశాల మేరకు, ప్రతి క్లస్టర్ ఇంచార్జి మరియు యూనిట్ ఇంచార్జ్ లు తమ తమ పరిధిలోని గ్రామాల నందు సంబంధిత గ్రామ నాయకులు , కార్యకర్తలు సహకారంతో ఖచ్చితంగా _*ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి* అనే కార్యక్రమం ఈ నెల 12 వ తేదీ లోపు పూర్తి చెయ్యవలసినదిగా కోరుతున్నాము._

-మీరు చేసిన ప్రోగ్రాం ఫొటోస్ గ్రూప్ లో సెండ్ చెయ్యండి. అలాగే నింపిన-ఇదేం-ఖర్మ ఫార్మ్స్ మైదుకూరు పార్టీ ఆఫీస్ నందు ఇవ్వవలసినదిగా కోరుతున్నాము.

*ముఖ్య గమనిక*
మన టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఈ నెలలో జరగబోయే జోనల్ మీటింగ్ నందు ప్రధానంగా *ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి* కార్యక్రమం మీద చర్చ ఉండబోతుంది. కావున ఎలాగైతే MLC ఎన్నికల సమయంలో మనం అందరం కష్ట పడ్డామో అలాగే ఈ కార్యక్రమానికి కష్టపడి విజయవంతంగా నూరు శాతం పూర్తి చేసి మన నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మంచి పేరుతెద్దాము. ఎప్పటిలాగే మన నిజయోకవర్గం పేరు ముందు స్థానంలో నిలబెడదాము.
*ధన్యవాదములు.*

ఇట్లు..
*తెలుగు దేశం పార్టీ కార్యాలయం*
*మైదుకూరు నియోజకవర్గం.*
( ఇది తెలుగుదేశం పార్టీ నియోక‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ కార్యాల‌యం నుండి వెలువ‌డిన ప్ర‌క‌ట‌న‌.. ఆపార్టీ వాట్సాప్ గ్రూపుల్లో వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌)..

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ నుండి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే ఒక్క సారిగా ‘‘ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి’’ కార్యక్రమంను తెలుగుదేశంపార్టీ శ్రేణులు ఈనెల 9 నుండి మొదలుపెట్టాయి.. అధినాయకుడి ఆదేశాలను తుచతప్పకుండా పాటించడంలో పార్టీ క్యాడర్ పోటీ పడుతున్నట్లు ఉంది.. వైసీపీ నిర్వహిస్తున్న ‘‘మా నమ్మకం నువ్వే జగన్ ’’అంటూ స్టిక్కర్‌ క్యాంపెయిన్ పోగ్రామ్ కు ఏమాత్రం తగ్గకుండా ‘‘ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి’’ కార్యక్రమం కొనసాగుతున్నట్లు కనపడుతోంది..

వైసీపీ స్టిక్క‌ర్ కార్య‌క్ర‌మంకు దీటుగా…

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తో కలసి గ‌త నాలుగు రోజులుగా ఇంటింటికి తిరిగి ప్రజలను కలుస్తూ.. నిరుద్యోగ స‌మ‌స్య‌, అడ్డ‌గోలుగా నిత్యావ‌స‌ర ధ‌ర‌లు, మ‌ద్య‌పానం, కుంటుప‌డిన అభివృద్ధి ఇసుక మాఫియా, తాగునీటి స‌మ‌స్య‌, అవినీతి, భ‌ద్ర‌త‌, కరెంటు స‌మ‌స్య‌, దుర్బ‌ర‌మైన రోడ్లు, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధ‌ర‌లు, రాజ‌ధాని రాజ‌కీయాలు, నిల‌క‌డ‌లేనిపాల‌న వంటి అంశాల ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ.. వారి నుండి సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకుంటూ పార్టీ అధిష్టాన‌వ‌ర్గంకు పంపించే విధంగా న‌మూనా త‌యారీలో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు..

ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం చేసుకుంటూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివ‌రించ‌డ‌మే కాదు.. వారి నుండి అభిప్రాయం తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు..రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజలకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్యల్ని ప్రస్తావించ‌డం.. ఈ సమస్యలపై అవగాహన కల్పించి, వాటిపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసేందుకు ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం బాగా దోహ‌ద‌ప‌డుతోంద‌ని తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి విన‌ప‌డుతున్న మాట‌.

అధికారం త‌ధ్య‌మ‌నే భావ‌న తెలుగు త‌మ్ముళ్లలో...

ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం నిర్వాహ‌ణ పై మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ జారీ చేసిన ప్ర‌క‌ట‌న ఆపార్టీ శ్రేణుల్లో ఒక్క‌సారిగా ఉత్సాహం పెల్లుబిక్కింది.. ఇందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ విజ‌యం సాధించ‌డం.. వచ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారం హ‌స్త‌గ‌తం చేసుకుంటుంద‌నే భావ‌న పార్టీ క్యాడ‌ర్ లో బ‌లంగా ఉండిపోయింది.. ‘‘మా నమ్మకం నువ్వే జగన్ ’’ కార్య‌క్ర‌మంను విజ‌య‌వంతం చేసుకునేందుకు ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. తెలుగుదేశం నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ పుట్టాసుధాక‌ర్‌యాద‌వ్ కేవ‌లం ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం నిర్వాహ‌ణ గురించి సూచ‌న‌లు చేశారు.. ఐనా.. వైసీపీ క్యాడ‌ర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగుదేశం క్యాడ‌ర్ ఇదేమి ఖ‌ర్మ కార్య‌క్ర‌మంను నిర్వ‌హిస్తుండ‌టం వెనుకు పార్టీ అధికారంలోకి రావ‌డం త‌ధ్య‌మ‌నే భావ‌న క‌ల్గి ఉండ‌ట‌మే అన్న‌ది విదిత‌మ‌వుతోంది..

మైదుకూరు కు తెలుగుదేశంలో రాజ‌కీయ‌ప్రాధాన్య‌త క‌ల్పించేయ‌త్న‌మా..?

తెలుగుదేశం గెలుపు ఖాయం.. అధికారం చేజిక్కించుకోవ‌డం ఖాయం అనే భావ‌న పార్టీ క్యాడ‌ర్ లో పూర్తిగా ఉండిపోయినందు వ‌ల్లే.. ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం ద్వారా త‌మ ఇమేజ్ పెంచుకునే దిశగా పార్టీ మండ‌ల నాయ‌కులు నుండి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు క‌దం తొక్కుతున్నారనే వాదన  వినపడుతోంది..  త‌మ అధినాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప్రాధాన్య‌త పెంచ‌డ‌మే కాకుండా.. రానున్న ఎన్నిక‌ల్లో విజ‌య‌ఢంకా మోగిస్తామ‌నే సంకేతాలు ఇచ్చేదిశగా పార్టీ క్యాడ‌ర్ స‌మాయ‌త్త‌మువుతున్న‌ట్లు ఉంది ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం కొన‌సాగుతున్న తీరు చూస్తే.. రాజ‌కీయ‌కోణంలో చూస్తే వైసీపీ చేప‌ట్టిన స్టిక్క‌ర్ కార్య‌క్ర‌మం కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద‌నే కాకుండా, పార్టీ ఇన్‌చార్జ్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వ‌ద్ద ప్ర‌త్యేక గుర్తింపు పొందాల‌నే ప‌ట్టుద‌ల పార్టీ క్యాడ‌ర్ లో కొట్టోచ్చిన‌ట్లు క‌న‌ప‌డుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల నుండి అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది..

*ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి* అంటూ తెలుగుదేశం.. ‘‘మా నమ్మకం నువ్వే జగన్ ’’ అంటూ మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఆద‌రాభిమానాలు పొంది వ‌చ్చే ఎన్నిక‌ల్లో లబ్ధి పొందాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఏ పార్టీ స‌ఫ‌లీకృత‌మ‌వుతుందో ? అన్నది ఆయా పార్టీ కార్యకర్తల, నాయకుల  పనితీరుకు అద్దంపడుతుంది..