* దశాబ్ధాల చరిత్ర నాది.. ప్రపంచ స్ధాయిలో గుర్తింపు తెచ్చా..నిలబెట్టా..
* నన్ను ఆదరించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెడుతున్న రైతునే కంట తడిపెట్టిస్తున్నా…
* ఎందుకు నా పట్ల ఇంత ‘‘ వివక్షత’’..? నన్ను అడ్డుపెట్టుకొని దోపిడి చేస్తున్న పట్టించుకునే దిక్కులేదు
* ఇంకొన్ని ఏళ్లు గడిస్తే మా ‘‘ఉనికి ’’ ఉండదమో..?
_ నందిరెడ్డి నాగశివారెడ్డి,జర్నలిస్టు
ఏంటి ఉల్లి కన్నీళ్లు పెట్టడం ఏంటి? మనకే కన్నీళ్లు తెప్పిస్తుంది కదా.. అనుకునేరు సుమా.. ఈ ఉల్లి అలాంటి ఇలాంటి గడ్డ కాదు.. అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన గడ్డ.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన గడ్డ..అంతే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బు సంపాదించి పెట్టే గడ్డ.. ఇది మామాలు ఉల్లి గడ్డ అనుకునేరు.. కాదు కాదు కేపీ ఉల్లి గడ్డ. ప్రపంచంలో అగ్రి పౌండ్ రోజ్ గా గుర్తింపు పొందింది. కేపీ అంటే క్రిష్ణాపురం.. కడప సమీపంలోని క్రిష్ణాపురం రైల్వే స్టేషన్ నుండి మద్రాసు ఓడరేవుకు తరిలింపు జరిగేది.. అందుకే మన పూర్వికులు క్రిష్ణాపురం ఉల్లిగడ్డ అనే పిలిచేవారు.
అంతర్జాతీయంగా ఔషధ విలువలు కల్గిన కేపీ ఉల్లి కడప,కర్నూలు , ప్రకాశంజిల్లాల్లో మొదట అధిక విస్తీర్ణంలో పండించేవారు. రాను రాను కేపీ ఉల్లి పంట పండించడం రైతులు మానుకుంటున్నారు. ఇందుకు కారణంగా మార్కెట్ పరంగా చేయూత లేకుండా పోవడం.. ఏడాది కేడాది కేపీ ఉల్లి పంట పండించే రైతులు నష్టాలకు గురవుతున్నారు. ప్రయివేట్ వ్యాపారుల దోపిడిలో అప్పులు భారం మూటగట్టుకుంటున్నారు. మైదుకూరు, దువ్వూరు ప్రాంతంలో కొంత వరకు కేపీ ఉల్లి పంట సాగు చేయడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో కేపీ ఉల్లి సాగుతో రైతుల కంట కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి..అవి ఆ మేర అంటే చివరకు కేపీ ఉల్లి కూడా కన్నీరు కార్చేంతగా.. ‘‘తనను నమ్ముకుని పొలంతో విత్తనం వేస్తే ప్రకృతి పగపడుతోంది.. వాటి నుండి తనను రైతు రక్షించుకుని నన్ను పెద్ద చేసినా చివరకు నన్ను కొనుక్కునే వ్యాపారుడు నేను ఎత్తులేను.. సైజు పెరగలేదు.. లావు లేవు.. రంగు లేవు.. అంటూ అతి తక్కువ ధరకు మమ్మల్ని తూచుకోకుండా సంచులో దొబ్చేస్తుంటే.. ఆసమయంలో తల్లిదండ్రులైన మా రైతుకుటుంబం పెట్టే కన్నీళ్లు మా కంట కన్నీళ్ల తెప్పిస్తోంది.. ఇక రోజుల్లో మా ఉనికే ఉండదేమో అన్న భయం మమ్మల్ని మరింత కన్నీళ్లకు గురిచేస్తుందంటూ’’ కేపీ ఉల్లి గడ్డ రోధిస్తోంది.
మమ్నల్ని విత్తి..పెంచి పెద్దచేసే రైతు కన్నీళ్లు తుడవలేరా?
మాపై ఉన్న దశాబ్ధాల నమ్ముకం ఇప్పుడిప్పుడే మా తల్లిదండ్రులైన రైతు కు సన్నగిల్లితున్నది. మమ్మల్ని భూమిలో విత్తినప్పుటి నుండి పెరిగి పెద్ద చేసే వరకు మా తండ్రి లాంటి రైతు పడే కష్టం మేము చూస్తూ వర్షంకు, తెగుళ్లకు ప్రాణాలు వదలకుండా భూమిలో నిలదొక్కుకుని పెరిగితే చివరకు రాబందుల చేతిలో మా అయ్య ( రైతు) చిక్కి విలపిస్తున్నాడు. దేశానికి వెన్నముక్క రైతు అంటూ ప్రతి ఒక్కరు నినాదాలు మాత్రం ఇస్తుంటారు.. ఆ నినాదాలకు తగ్గట్టు మమ్మల్ని ఆదరించి పండించే రైతులను ఆదుకునే పరిస్థితి లేకపోవడం కన్నీళ్లకు గురిచేస్తోంది. ఎంజే సుబ్బరామిరెడ్డి, డీఎన్ నారాయణ, పోలు కొండారెడ్డి లాంటి ఉద్యమ వీరులు భూ గర్బంలో కలిసిపోవడంతో మేము అంతరించిపోతున్నాము.
బిజేపీ వచ్చింది.. మాకు మేలు చేస్తారని సంబరపడ్డాము..
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడి బిజేపోళ్లు ముఖ్యంగా మైదుకూరు అసెంబ్లీకి ఆపార్టీ తరుపున పోటీ చేసిన బీపీ ప్రతాప్ రెడ్డి మా కోసం ఉద్యమాలు చేశాడు.. మేము సంబరం పడ్డాము.. రైతు ఉద్యమనాయకుడు బీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో మాకు మంచి రోజులు వచ్చాయి అని సంబరపడ్డాము.. తొమ్మిదేళ్లు గడిచింది.. క్రమేపీ మేము బలహీనపడటం తప్పితే మాకు శాశ్విత పరిష్కారం మా ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించిన బిపీ ప్రతాప్ రెడ్డి, వారి పార్టీ నాయకులు చూడలేకపోయారు.. సొంత భజనలు తప్పితే మా గురించి ఆలోచించే ప్రణాళిక బిజేపీ వారికి లేకపోవడం మరింత కన్నీళ్లకు గురవుతున్నాము.
రాముడు లాంటి ‘‘రఘురాముడు’’ వచ్చాడనుకున్నాము..!
ఓదార్పు కు వచ్చారు ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. వాళ్ల తండ్రి వైెఎస్ మరణవార్తతో అకాల మరణం పొందిన కుటుంబాలను ఓదార్పు కోసం వచ్చినప్పుడు మమ్మల్ని ఓదార్చారు.. మా తండ్రులైన రైతులకు భరోసా ఇచ్చారు. ఇంకేమిలే మా కన్నీళ్లు తొలగిపోతాయి అనుకున్నాము.. అంతే కాదు మా కోసం గతంలో ఉద్యమించిన రాముడు లాంటి రఘురాముడు( రఘురామిరెడ్డి) ఎమ్మెల్యే అయ్యాడు.. ఇక మంచిరోజులే అనుకున్నాము. జగనయ్య.. రఘురామయ్య వచ్చి నాలుగేళ్లు గడిచింది. మా భవిష్యత్తు విషయంలో ఏ మాత్రం ముందుంజ లేదు.. పసుపు పండించే మరో తల్లిదండ్రులైన రైతులకు ఆదుకునేందుకు రఘురామయ్య అసెంబ్లీలో మాట్లాడం మంచిది. మాకు మాట ఇచ్చిన వాళ్ల నాయకుడు మా గురించి తెలియజెప్పకపోవడం మరింత బాధిస్తోంది.. మా పట్ల పెద్దాయనకు ఉన్న చిత్తశుద్ది ఇదేనా అని అనుమానం కల్గుతోంది. పసుపు చేసిన మేలు మేము చేయలేమనే భావన వారిలో ఉండిపోయిందా అన్న సందేహం వస్తోంది..
మా గురించి సర్వం తెలిసిన ‘‘రవీంద్రుడు’’కూడా మౌనమే..!
దశాబ్ధాలుగా మా కష్టాలు కన్నీళ్లు గురించి సర్వం తెలిసిన వ్యక్తి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. ఈ మధ్యకాలంలో మా గురించి కనీసం స్మరించేపరిస్థితి లేకపోవడంను గమనించి బాధపడుతున్నాం. వైసీపీ ప్రభుత్వ పాలనపైన గానీ, స్ధానికంగా జరిగే పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ గళం విప్పుతున్న రవీంద్రుడు మా గురించి ఒక్కమాట మాట్లాడినా బాగుండేది. రైతులకు ప్రజలకు ఏక్కడ అన్యాయం జరిగినా? అధికారపార్టీ అరాచాలను అడ్డుకుంటా అంటూ మీడియా ద్వారా ఎలుగెత్తుతున్న రవీంద్రుడు మా గురించి మాట్లాడి ఆదుకుంటారమో అని అశించాము.. మా రైతు బిడ్డలు మా కారణంగా ప్రయివేట్ పరంగా, ప్రభుత్వ పరంగా దోపిడికి గురైనా మౌనంగా ఉండటం మరింత బాధేస్తోంది.. కన్నీళ్లు తుడవలేకపోయారనే వేదన ఉండిపోయింది.
ప్రతిపక్షం నేత ‘‘పుట్టా’’ కూడా విస్మరింపే.!
అధికారపార్టీ నేతల అక్రమాలు గురించి ప్రశ్నించడమే కాకుండా.. కోర్టుల్లో కేసులు వేసేంత వరకువెళ్లి తెలుగుదేశం నాయకులు పుట్టా సుధాకర్ యాదవ్ కూడా మమ్మల్ని ఆదరిస్తున్న రైతు బిడ్డల విషయంను విస్మరించారు. ప్రతిపక్ష స్ధానంలో ఉండి గట్టిగా పోరాడి మా రైతు బిడ్డల కన్నీళ్లు తుడవడంలో పుట్టా మేము ఆశించిన మేర పనిచేయలేకపోయారనే ఆలోచన మమ్మల్ని మరింత బాధిస్తోంది..
ఈప్రాంతంకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్న మా పట్ల.. మా రైతుల పట్ల వివక్షత ఇలాగే చూపితే.. రాబోవు కాలంలో కేపీఉల్లి గడ్డలమైన మేము అంతరించిపోతాము.. అప్పుడు రైతు ఉద్యమ నాయకులకే కాదు.. ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల, ప్రతిపక్ష పార్టీల నేతల, అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఉనికేకాదు.. మీ మనుగడ కూడా ప్రశ్నార్థకమే అవుతుంది..
– ఇట్లు
కేపీ ఉల్లిగడ్డలు