ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ..
సరదాగా ఊడలు పట్టుకుని వేలాడుతూ..
నీటిలో ఈతకొడుతూ..
-Nandireddy Nagasivareddy
జర్నలిస్ట్…✍️
‘‘చుట్టూ కొండలు.. ఆకాశంలో చంద్రుడు.. వెన్నెల వెలుగుల్లో శరీరాన్ని తాకుతూ చక్కిలిగింతలు పెట్టే చల్లగాలులు.. కళ్ళు మూసుకుంటే అదొక భూతల స్వర్గం అనే ఊహాలోకం.. అబ్బా ఆ ఆనంద క్షణాల గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ ఆ ప్రదేశంలో ఏదో మ్యాజిక్ ఉందనిపిస్తుంది.. అడవిలో గమనించాలే గానీ జీవితంలో ఏమేమి కావాలో అన్నీ నేర్పిస్తుంది.. జీవితంలో ఎప్పుడైనా మనసుకు తట్టుకోలేని బాధ కలిగితే మాత్రం అడవికి వెళ్లిపోదామా అని అన్పించక మానదు..
‘‘మనిషి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డప్పటి నుండి కాలికి నేలకు ఉండే అనుబంధాన్ని మరిచిపోతున్నాము.. ప్రకృతే మన ఊపిరి.. ఉదయం సాయంత్రం వాకింగులు, జిమ్ములకు కేటాయించే సమయాన్ని అడవిలో ఉపయోగిస్తే ఆ ఆనందమే వేరు.. పచ్చని చెట్లు, ఆకులు చూసినప్పుడుమన కళ్లు మైమరిచిపోతాయి “మంచి షూటర్ కూడా ఫైరింగ్ కి ముందు చుట్టుపక్కల ఏదైనా ఆకుపచ్చ రంగు చూస్తే దృష్టిలోపం తొలగి లక్ష్యం వైపే గురుపెట్టవచ్చు. అడవిని ఇష్టపడేది అందుకే.. సమయం దొరికితే అలా అడవులకు వెళ్ధామా… ప్రకృతిని ఆస్వాదిద్దిమా.. అక్కడి చరిత్ర నేపథ్యం తెలుసుకునే విషయంలో నాది తాపత్రయమే అని చెప్పవచ్చు అంటున్నారు’’ మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్..
పోలీసు అనే పేరు వినగానే ఖాకీ డ్రస్సు, చేతిలో లాఠీ, మాటల కాఠిన్యత ఇవే ఎక్కువమందికి గుర్తొస్తాయి. నాగరికత పెరిగే కొద్దీ సమాజంలో మార్పులు రావడం ఎంత సహజమో కాలానికి తగ్గట్లు వ్యవస్థల్లో కూడా మార్పులు వస్తుంటాయి. దానికి తోడు ఉన్నత వ్యక్తిత్వం కలిగిన అధికారుల రాక ఆ ప్రాంతాల ప్రజల ఉన్నతికి, అభివృద్ధికి పాటుపడుతుంది. సరిగ్గా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి మన మైదుకూరు సబ్ డివిజన్ కు డీఎస్పీగా వంశీధర్ గౌడ్ విచ్చేశారు అనడంలో అతిశయోక్తి లేదు.. అడవులు చూసేందుకు భయంకరంగా ఉన్నప్పటికీ నిజానికి అవి మనిషిని ఒత్తిడి నుండి బయటపడేందుకు కావాల్సిన ఉపశమనాన్ని ఇస్తాయి. వంశీధర్ గారు సరిగ్గా ఇలాగే ఆలోచిస్తారు అనడానికి గత కొంతకాలంగా ఆయన నడిచిన అడవిబాటలే సాక్షం.
శివ రాచర్ల గారి అధ్వర్యంలో కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం నుండి అహోబిలం వరకు 26 కిలోమీటర్ల అడవి ప్రయాణం.. మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపే యాత్ర ఇది.. ఆ యాత్రకు బద్వేల్ ఆర్డీవో వెంకటరమణ నేనుసైతం అంటూ సిద్దపడ్డారు. వీరికి ష్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు జతకట్టారు.. అంతే కాదు చెంచుబాబు తన కుమారుడిని కూడా వెంటతీసుకొచ్చారు.
నిత్యం ప్రోటోకాల్ లైఫ్, ఏది కావాలన్నా టేబుల్ ముందుకు తెచ్చే స్టాఫ్.. బాసిజం ఎఫెక్ట్.. ఎంత వద్దనుకున్నా నేరస్తుల పట్ల కఠినత్వం.. మరొకరు రెవిన్యూ ఉన్నతాధికారి ఇలాంటి అధికారులతో ఈ యాత్రలో ఎలా అబ్బ.. వీళ్ల మధ్య మనం యాడ నిమ్మళంగా ఉండగలం అన్న భావన మా అరణ్య శేఖర్, వివేక్ వారి బృందంకు. కొత్త పరిచయం మొదట్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండిపోయారు.. తర్వాత వారి మధ్య మైత్రి కొనసాగింది. అడవితో తమ అనుభవాలను ఒకరికొకరు చెప్పుకుంటూ ముందుకు అడుగులు వేశారు.. తమ వెంట తెచ్చుకున్న ఆహారపదార్థాలను పంచుకున్నారు.. పచ్చికారెం నూరి పెడితే నేలమీద కూర్చుని పూరీలో నంజుకుంటూ ఆనందంగా తినేశారు.. తమ జీవితంలో ఎదురైన అనుభవాలను పాఠాలుగా చెప్తూ సైబర్ నేరాల పట్ల జాగృతం చేసే తీరును.. మానవ సంబంధాలను, వాటి అవశ్యకతను వివరిస్తూ జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో అన్నది బృంద సభ్యులకు పోలీసు,రెవిన్యూ అధికారులు పట్టి పట్టి చెబుతూ అదే దిశగా ముందుకు నడిపించారు. మేము ఉన్నతాధికారులము అన్న కించిత్ గర్వం వారిలో మచ్చుకైన కనపడలేదు.. 26 కిమీ దారి పొడవునా కబుర్లు చెబుతా ఆత్మీయుల్లా బృంద సభ్యులతో కలిసిపోయారు ఈ ఉన్నతాధికారులు.. ఆరంభంలో ఒకరిమద్య ఒకరికి సంబంధమే లేదు అన్నట్లు కొనసాగినా.. చివరకు ప్రతి ఒక్కరితో చేయి కలుపుతూ ఆప్యాయంగా పలకరిస్తూ వీడ్కోలు చెబుకున్నారు.. యాత్రను నెమరువేసుకున్నారు.. చిన్నా, పెద్ద అంటూ తారతమ్యం లేకుండా స్నేహితుల్లా అంటే ఒక జట్టులో ఉండాల్సిన సభ్యుల పాత్రలను డీఎస్పీలు వంశీధర్ గౌడ్, చెంచుబాబు, ఆర్డీవో వెంకటరమణలు పోషించారు.. ఇది బృంద సభ్యులను విస్మయపరిచింది.
నల్లమల, లంకమల, పాలకొండల మధ్య మైదుకూరు ఉండటంతో ఈ అడవుల్లో నెలకొన్న పుణ్యక్షేత్రాలకు భక్తులు వేల సంఖ్యల్లో వస్తుంటారు.. ఇక్కడికి వెళ్లే దారులు నిత్యం కురిసే వర్షాలకు పారే వంకలతో దారులన్నీ కోసుకుపోయి ప్రయాణానికి అంత సురక్షితంగా ఉండవు.. అంతేకాదు ఇక్కడి అడవులన్నీ దాదాపు ఎర్రచందనం, పెద్ద పులి, కలివికోడి, నెమలి వంటి ఎంతో విలువైన జాతీయ సిరిసంపదల సమ్మేళనాన్ని తనలో నింపుకున్నవే.. ఒకటా రెండా అనునిత్యం అన్ని శాఖలతో సమన్వయ పరుచుకుంటూ, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు శాఖ ఎంత పని ఒత్తిడికి గురవుతుంటుందో కదా. అయినప్పటికీ మొన్న శివరాత్రికి ముందే బద్వేలు దగ్గర గల మల్లెంకొండకు మైదుకూరు డిఎస్పీ వంశీధర్ తన సిబ్బందితో మరియు మిత్రులతో కలిసివెళ్ళి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సదుపాయాలను అందేలా దగ్గరుండి పర్యవేక్షించడం కొసమెరుపు..
బద్వేలు దగ్గర గల మల్లెంకొండ ప్రయాణం ఎంత కష్టమైందో అందరికీ తెలిసినదే. ఇటీవల శివరాత్రి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా బద్వేలు ఆర్డీవో వెంకట రమణతో కలసి మైదుకూరు డిఎస్పీ వంశీధర్ , కడప ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ చెంచుబాబు కొండల వెంబడి అడుగులు వేశారు.. మల్లెం కొండ ప్రాంతాన్ని కలియతిరిగారు.. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ కొండల్లో కలియతిరిగారు. ఇది శారీరక కష్టాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వటమే కాకుండా అక్కడి ప్రజల జీవన విధానం, సమస్యలు, సవాళ్ళను ఎదుర్కొనే మార్గాలు ఎన్నో అడవి బాటలు నేర్పాయింటున్నారు డీఎస్పీ వంశీధర్ గౌడ్..
మైదుకూరు నుండి పోరుమామిళ్ళ పోయే దారిలో నల్లమల అడవి ఘాట్ దాటగానే ఎడమవైపు ఆర్చి నుండి దూదెమ్మ కోన మీదుగా అడవిలో సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణిస్తే బిలం గుహ వస్తుంది. గుహలోపల తపస్సు చేసుకునే ముని ఆకారపు సహజసిద్ద శిల అందర్నీ ఆకట్టుకుంటుంది, లోపల మనిషి మాత్రమే పట్టే ఇరుకైన బోరియల్లో దూరుతూ సాగే అత్యంత సాహసోపేతమైన ప్రయాణం ఉంటుంది. ఈ ప్రదేశాన్ని మొట్టమొదట నేను రచించిన మైదుకూరు చరిత్ర పుస్తకం ద్వారా కొండపొలం రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి బయటి ప్రపంచంకు తెలియజెప్పారు. సన్నపురెడ్డి , భూమన్ సార్, వివేక్ లంకమల, అరణ్య శేఖర్ వంటి ట్రెక్కింగ్ వీరుల ఆధ్వర్యంలో 90 మంది Into The Nature టీమ్ సభ్యులతో కూడిన బృందం బిలంను సందర్శించింది,, బిలంకు వెళ్లే దారి మొత్తం ఫారెస్ట్ జంగిల్ జర్నీని తలపిస్తుంది, గుహ లోపల వెలుగులు నింపి చిన్న చిన్న సదుపాయాలను కల్పిస్తే ఎల్లోరా గుహలకు ఏమాత్రం తీసిపోని గుహ ఈ బిలం గుహ. జనాలు ఎవ్వరూ లేని ఈ ప్రదేశంలో సంచరించాలంటే ఒంట్లో శక్తి ఉంటే సరిపోదు గుండెల నిండా దైర్యం ముఖ్యంగా ప్రకృతిని ఆస్వాదించే గుణం ఉండాలి. వంశీధర్ గారు వారి మిత్రబృందం ఆ ప్రదేశాన్ని కూడా చుట్టేసి వచ్చారు..